ఈమధ్య కాలంలో యూత్ నుంచి పెద్ద వారి వరకూ కూడా గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానంతో పాటు తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గతంతో పోలిస్తే కోవిడ్ 19 తర్వాత ఈ సమస్య ఇంకా ఎక్కువే కనిపిస్తోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే హార్ట్ అటాక్లు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిని కూడా మింగేస్తుంది.
గుండెపోటు రావడానికి..అధిక రక్తపోటు, క్రమశిక్షణ లేని జీవనశైలి మాత్రమే కారణం అని అందరికీ తెలిసినా..కోవిడ్ తర్వాత ఈ సమస్య ఎక్కువ అయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19 తర్వాత గుండెపోటు సమస్యలు పెరిగినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్ తాజా పరిశోధనల్లో .. డయాబెటిస్ వంటి సమస్యతో సమానంగా.. తీవ్ర గుండెపోటు, పక్షవాతానికి ప్రధాన కారణం కోవిడ్ కావొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తొలిసారి కొవిడ్-19 విజృంభించిన సమయంలో దీని బారినపడ్డవారిలో మూడేళ్ల వరకూ గుండెపోటు ముప్పు, పక్షవాతం, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు రెట్టింపయినట్టు బయటపడింది.
అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతూ.. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకని వారికంటే కూడా గుండెజబ్బు, మధుమేహం లేని, తీవ్ర కొవిడ్ బారినపడ్డవారికి గుండెపోటు, పక్షవాతంతో మరణించే అవకాశాలు 21 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరగటంలో కొవిడ్ వైరస్కు జన్యువుల మధ్య పరస్పర చర్య జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.