ఆంధ్రప్రదేశ్ పోలీసులు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)కు నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని పోలీస్ బృందం హైదరాబాద్లోని వర్మ ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేసింది. వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో, సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా పోస్టులు చేశారంటూ కేసు నమోదైంది.
నవంబర్ 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులో ఆదేశించారు. వర్మపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు BNS చట్టంలోని 336(4), 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ధృవీకరించారు. వర్మ తరచూ వైసీపీ ప్రభుత్వ ప్రతినిధుల తరుపున టార్గెట్ చేసిన టిడిపి, జనసేన నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేపథ్యం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో…కూటమి నేతలను టార్గెట్ గా వర్మ సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారనే సంగతి తెలిసిందే.
నటి శ్రీరెడ్డిపై కూడా తాజాగా రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు. వరుస ఫిర్యాదులతో నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది శ్రీరెడ్డి నే అని తెలుస్తుంది.