పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ap Government Takes Key Decision On Pension Distribution

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీ మేరకు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచాలని నిర్ణయించింది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తోంది. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియపై కూడా తాజా స్పష్టత ఇచ్చింది.

డిసెంబర్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కేటగిరీల పెన్షన్లను పెంచి అమలు చేస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతీ నెలా ఒకటో తేదీన లబ్ధి దారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తే, ప్రస్తుతం కూటమి పాలనలో వాలంటీర్లను పక్కన పెట్టి వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందితోనే లబ్దిదారుల ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పంపిణీ విధానాన్ని రియల్ టైమ్‌లో పరిశీలిస్తోంది. ఒకటో తేదీనే దాదాపు అన్ని లబ్ధి దారులకు పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే నవంబర్ 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు సచివాలయాల సిబ్బంది నగదు పంపిణీ సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ 30వ తేదీ శనివారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా రెండు నెలలు పెన్షన్లు తీసుకోని వారు సైతం, మూడో నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో, ఈ నెలలో రెండు సార్లు పెన్షన్ అందుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.