రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 నుంచి 2022-23 విద్యాసంవత్సరంకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజుల విషయంలో సవరణలు చేస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో యాజమాన్య కోటా ఫీజు తగ్గడంతో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట కలగనుంది. అలాగే ఎంబీబీఎస్ విద్యకు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు ఫీజు వసూలు చేస్తుండగా, ఇకనుంచి నాలుగున్నర సంవత్సరాలకు మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి.
ఎంబీబీఎస్ కు సంబంధించి గతంలో రూ.12,155గా ఉన్న కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ.15 వేలకు పెంచారు. రూ.13,37,057గా ఉన్న బి కేటగిరి (యాజమాన్య కోటా) ఫీజును రూ.12 లక్షలకు తగ్గించారు. సి కేటగిరీ (ఎన్ఆర్ఐ కోటా) ఫీజును రూ.33,07,500 నుంచి రూ.36 లక్షలుగా మార్చారు. అలాగే డెంటల్ కోర్సులకు సంబంధించి గతంలో రూ.12,155గా ఉన్న కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ.13 వేలకు పెంచారు. రూ.5,46,978 గా ఉన్న బి కేటగిరి (యాజమాన్య కోటా) ఫీజును రూ.4 లక్షలకు తగ్గించారు. సి కేటగిరీ (ఎన్ఆర్ఐ కోటా) ఫీజును రూ.12 లక్షలుగా నిర్ణయించారు. ఇక 5 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ట్యూషన్ ఫీజు రూ.15 లక్షలుగా సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ