ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఒక కీలక సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కాగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా.. ఏడాది పాటు కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర సంస్మరణ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సమావేశానికి చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. అలాగే ఈ సమావేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా పలు కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో శనివారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరవనున్నారు. అలాగే నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత దేశ రాజధానిలో అధికారిక సమావేశానికి చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని నిరసిస్తూ 2018లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి టీడీపీ వైదొలిగిన విషయం విదితమే. ఇక 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్డౌన్ గుర్తుగా గత సంవత్సరం మార్చి 12న మహోత్సవ్ ప్రారంభమవగా 2023 ఆగస్టు 15తో ముగియనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY