ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతి రైతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. మూడు రాజధానుల అంశంపై తెరపైకి వచ్చినప్పటినుంచి, గత తొమ్మిది రోజులుగా రాజధాని ప్రాంతంలో చేపడుతున్న నిరసనలు, చోటు చేసుకున్న పరిణామాలను రైతులు గవర్నర్ కు వివరించారు. గత ప్రభుత్వం రాజధానికోసం భూములు అడిగేతేనే రైతులందరూ స్వచ్చంధంగా ఇచ్చామనే ఈ విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా రైతులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరామని చెప్పారు. తాము ప్రస్తావించిన అన్ని విషయాలపై గవర్నర్ సానుకూలంగానే స్పందించినట్టు రైతులు పేర్కొన్నారు. రాజధానిని తరలిస్తామని ఏకపక్షంగా ప్రకటించడం అన్యాయమని రైతులు వాపోయారు.
[subscribe]