జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డిసెంబర్ 25, బుధవారం నాడు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ఈ క్రమంలో డిసెంబర్ 29న రాంచీలో జరగనున్న కార్యక్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో 81 స్థానాలుండగా ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హేమంత్ సోరెన్ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ బుధవారం నాడు 10 జనపథ్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. సోనియా గాంధీతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకే కలుస్తున్నానని చెప్పారు. అనంతరం రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖ నాయకులను ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
[subscribe]