టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన కొనసాగుతుంది. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కలుసుకోనున్నారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలు, రహదారి నిర్మాణాలతో పాటుగా, అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలును పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ముందుగా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆ తరువాత టీడీపీ కీలక నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో రాజధాని గ్రామాలకు బయలుదేరారు.
చంద్రబాబు అమరావతి పర్యటన మార్గంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు రాళ్లు విసిరారు. అలాగే పలుచోట్ల నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వమే రైతుల పేరుతో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు చూస్తుందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రాజధాని శంఖుస్థాపన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తుందని, రాజధానిని శ్మశానంతో పోల్చడం బాధ కల్గించిందని చెప్పారు. రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నిర్మాణంపై నిర్లక్షత వహిస్తే భావితరాల భవిష్యత్ నాశనం చేయడమే అని అన్నారు. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులను అవమానిస్తున్నారని, ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కు పోతున్నాయని విమర్శించారు.
[subscribe]