ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అత్యున్నత కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ పై అడిగిన ప్రశ్నకు మంత్రి ఆదిమూలపు సురేష్ సమాధానమిస్తూ, 2020 జనవరిలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటన చేశారు. అనంతరం రాష్ట్రంలో మహిళల భద్రతపై చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ప్రతి రోజు ఒక నవరత్నంపై చర్చించి, సంక్షేమ పథకాల పూర్తీ వివరాలు తెలుపుతూ, ప్రతిపక్షంపై ఆధిపత్యాన్ని చూపించాలని అధికార పక్షం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రశ్నోత్తరాల అనంతరం జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు పాటు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు ఈ సమావేశాల్లో అధికార పక్షంపై ఎదురుదాడి చేయాలనీ ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించుకుంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక ధరలు, ఉల్లి ధర పెరుగుదల, అమరావతి నిర్మాణం, మహిళలపై అత్యాచార ఘటనలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు.
[subscribe]