మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పక పోవడం అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం అని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి, టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు. అవినీతి, విధ్వంస పాలనపై ప్రశ్నించిన వారిపై వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు” అని అన్నారు.
“రోజురోజుకూ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓవైపు చెబుతుంటే, మరోవైపు ఈ వ్యవహారంలో నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు?. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు” అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ