భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 8, ఆదివారం నాడు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో వెస్టిండీస్ జట్టు భారత్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ ఓపెనర్ సిమన్స్ సిక్స్లు, ఫోర్లులతో చెలరేగి ఆడాడు. 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సిమ్మన్స్, చివరలో పూరన్ (38*) తో కలిసి వెస్టిండీస్ జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. విండీస్ 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగుల చేసింది. భారత్ ఆటగాళ్లలో శివమ్ దూబే (54), రిషబ్ పంత్ (33) మాత్రమే మెరుగ్గా రాణించారు. వన్డౌన్లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శివమ్ దూబే తన షాట్లతో అభిమానులను అలరించి, తన కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మిగిలిన భారత్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ (11), రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), శ్రేయస్ అయ్యర్ (10), రవీంద్ర జడేజా (9) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, వాల్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా పొలార్డ్, హోల్డర్, పియరీ, కాట్రెల్ తలో వికెట్ తీశారు.
తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్లు సిమ్మన్స్, ఎవిన్ లూయిస్ (40) భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. భారత్ ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పులను సద్వినియోగం చేసుకుంటూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. లూయిస్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన హెట్మైర్ (23), ఆ తరువాత నికోలస్ పూరన్(38*) పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ సునాయసంగా విజయం సాధించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇక భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది.