ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా చేపట్టిన రెండో విడత మహా పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి యాత్ర మద్దలైంది. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు, ప్రజలు ముందుగా గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేంకటేశ్వర స్వామి వారి రథాన్ని ముందుగా నిలిపి మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైతులు, మహిళలు వేలాదిగా పాల్గొన్న ఈ పాదయాత్ర కృష్ణాయపాలెం, పెనుమాక, యర్రబాలెం మీదుగా 15 కిలోమీటర్ల మేర సోమవారం సాయంత్రం మంగళగిరికి చేరుకోనుంది. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం మళ్ళీ యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.
60 రోజుల పాటు దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగా కొనసాగనున్న ఈ యాత్ర నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి ఆలయం వద్దకు చేరుకుంటుంది. ఈ క్రమంలో 12 పార్లమెంటు నియోజకవర్గాలు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే ప్రకటించారు. గత మొదటి విడత యాత్రను ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతో దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా చేశామని, ఈసారి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని అమరావతి ఆవశ్యకతను వివరించేందుకు శ్రీకాకుళం లోని అరసవల్లి వరకూ నిర్వహిస్తున్నామని ఐకాస నేతలు, రైతులు స్పష్టంచేశారు. కాగా రైతులు చేపట్టిన ఈ పాదయాత్రకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ మంత్రులు మాగంటి బాబు, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సీపీఐ నేత నారాయణ తదితరులు పాదయాత్రను ప్రారంభించారు. ఇక వీరితో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల నేతలు రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY