ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ రోజు బీఏసీ సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెంనాయడు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు 14 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సెలవు దినాలు కలుపుకొని ఈ నెల 11 వ తేదీ నుండి 30 వరకు సమావేశాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. విపక్ష సభ్యుల సూచన మేరకు జూలై 11 న రాష్ట్రంలో కరువు పరిస్థితులు పై చర్చించనున్నారు. జూలై 12 న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు, మరియు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు తగట్టు ముఖ్యమంత్రి జగన్, ఇతర ఆర్ధిక నిపుణుల సహాయంతో బడ్జెట్ పై కసరత్తు చేసినట్టు సమాచారం.
ఎన్నికల ప్రచారంలో నవరత్నాల పై ఇచ్చిన హామీలను దృష్టి లో పెట్టుకొని రూపొందుతున్న ఈ బడ్జెట్ లో, ముఖ్యమంత్రిగా మొదటిసారి అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ముద్ర ఎలా ఉండబోతోందనే ఆశక్తితో ప్రజలు ఎదురుచూస్తున్నారు.