ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతూ బెల్ట్ షాపులను కట్టడి చేయగా, ఈ అంశంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 19, మంగళవారం నాడు బార్ల పాలసీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లును మినహాయించి అనుమతి ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జనవరి 1, 2020 నుంచి బార్లకు సంబంధించి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ సమీక్ష అనంతరం మంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, పాత బార్లు అనుమతి పూర్తిగా తీసేసి, కొత్త బార్లును లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని తెలిపారు. అలాగే బార్లలో విక్రయించే మద్యం ధరలను పెంచే ఆలోచన కూడ ఉందన్నారు. ఇక బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ మద్యం సరఫరా కోసం, ఆహారం కోసం రాత్రి 11 వరకు అనుమతిస్తామన్నారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరైనా మద్యం కల్తీకి, స్మగ్లింగ్, నాటుసారా తయారీకి గాని పాల్పడితే నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతే గాక లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు మద్యం అక్రమాలపై చర్యలకు సంబంధించి త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
[subscribe]