ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నా ఇప్పుడే వేడి రాజుకుంటోంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అన్న విషయంపై రోజుకో రకంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పొత్తుల విషయంలో తాము క్లారిటీతోనే ఉన్నామని, 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. అయినా బీజేపీకి జనంతోనే పొత్తు అని, అంతగా అవసరమైతే జనసేనతో పొత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
కాగా వచ్చే ఎన్నికలలో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయనే వార్తలపై స్పందిస్తూ.. ప్రస్తుతం తాము జనసేనతో కలిసి పనిచేస్తున్నామని, అయితే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనే విషయం పవన్ కల్యాణ్నే అడగాలని సూచించారు. నరేంద్ర మోదీ సారధ్యం లోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తోందని, ఆ అభివృద్ధిని చూపించి ప్రజలను ఓట్లు అడుగుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని, అయితే గత టీడీపీ ప్రభుత్వం వలే అధికారానికి దూరమవుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ