ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లిలో ఈరోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కొత్తపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అతికష్టం మీద పోలీసుల సహకారంతో ఆయన గ్రామం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంకట్రావు గాయపడ్డారు. శనివారం ఉదయం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో హత్యకు గురైన వైసీపీ నేత ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించటానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి దిగారు. గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే కారణమంటూ వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సాహించడం వలనే ఈ హత్య జరిగిందని మండిపడ్డారు.
దీంతో ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతో పాటు తోపులాట చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద ఎమ్మెల్యే వెంకట్రావును గ్రామస్తుల దాడి నుంచి తప్పించి బయటకు తీసుకు వచ్చారు. గ్రామంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తనపై అకారణంగా ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించిందని, వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ హత్యలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కాగా గ్రామంలోని రెండు వర్గాలూ వైసీపీ పార్టీకి సంబంధించినవే కావడం విశేషం. ఆర్గ విభేదాల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ