ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా.. ‘రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజా పోరు’ పేరుతో 15 రోజులపాటు యాత్ర చేపట్టింది. యాత్ర కోసం ప్రత్యేకంగా ప్రచార రథాన్ని (బస్సు) ఏర్పాటు చేశారు. ఈ బస్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సోము వీర్రాజు బొమ్మలను ముద్రించారు. సోమవారం ఈ యాత్రను విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అసమర్ధ, అభివృద్ధి నిరోధక పాలనను ఎండకట్టడానికి నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా పోరు’ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. యాత్రలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో పాల్గొని స్థానిక సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం చేస్తుందో, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. 175 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 వేల బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వీర్రాజు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏపీలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY