జనసేన పార్టీ విభాగమైన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ లీగల్ సెల్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, నగర కమిటీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కాబోతోందని స్పష్టం చేశారు. రాజకీయ నిపుణుల అధ్యయనాలు, సర్వే రిపోర్టులు ప్రకారం చూస్తే వైసీపీకి వచ్చే సీట్లు అవే అన్నారు. జనసేన పార్టీ పుంజుకొంటోందని తెలుపుతూ, నాయకులు, శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.
“రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు నాకు నిత్య స్పూరణ. అధ్యయనం, పోరాటం, నిర్మాణం అనే మూడు మాటలు నాకు పరిశీలకాలు. 2003 నుంచి రాష్ట్ర రాజకీయాలను, ప్రజా సమస్యలను నిత్యం అధ్యయనం చేశాం. 2014 నుంచి రాష్ట్రంలోని సమస్యలపై నిత్య పోరాటాలు చేసాం. ఉద్దానం సమస్య కానివ్వండి. రాజధాని రైతుల సమస్య కానివ్వండి. గళమెత్తి పోరాటం చేశాం. ఇప్పుడు పార్టీ నిర్మాణ దశకు చేరుకున్నాం. వచ్చే ఎన్నికల్లో ఈ నిర్మాణ దశనుంచి అధికారం చేపట్టేవరకు మన ప్రయత్నం బలంగా జరగాలి. నాని ఫాల్కీవాలా, బీ.ఆర్.అంబేద్కర్ లను నా హీరోలుగా భావిస్తాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతిపై వైసీపీ చట్ట సభల్లో మాట ఇచ్చింది:
“రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి అమరావతిపై వైసీపీ ఆడుతున్న ద్వంద వైఖరి ప్రజలు గుర్తించాలి. చట్టసభల్లో బేషరతుగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. అప్పట్లో జనసేన పార్టీ రాజధానిని విస్తరించుకుంటూ పోవాలని, ఒకేసారి 35 వేల ఎకరాల్లో అభివృద్ధి అసాధ్యమని చెప్పింది. కానీ వైసీపీ మాత్రం అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత సైతం ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో నమ్మించారు. ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ నానా హడావుడి చేస్తోంది. మరి మీకు అప్పట్లోనే మూడు రాజధానులు చేయాలని ఆకాంక్ష ఉంటే, చట్టసభల సాక్షిగా ఎందుకు ప్రజలను మభ్య పెట్టారో సమాధానం చెప్పాలి” అని అన్నారు.
జనసేన పార్టీ ప్రజల్ని నమ్ముకుంది:
“జనసేన పార్టీ ప్రజల్ని నమ్ముకుంది. నేను రోడ్డు మీదకు వస్తే లక్షలాది మంది జనం వస్తారని నాయకులు చెబుతుంటారు. అది నిజమే కానీ దానిని పాల పొంగులా భావిస్తాను. మనకోసం నడిచి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. వారిని ఓటర్లుగా మార్చాలి. గత నెలన్నర రోజులుగా ఎంతోమంది మేధావులను, పార్టీ సానుభూతిపరులను, పెద్దలను కలిసి అనేక విషయాల్లో చర్చించాం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలం పుంజుకోవడానికి మనమేం చేయబోతున్నాం అన్నది ఇప్పుడు చాలా కీలకం. మన సన్నద్ధత ఏంటి, పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది నాయకులు ఆలోచించాలి. చాలామంది మేధావులు చెప్పిన మాటలు ప్రకారం జనసేన పార్టీకి భారీగా ఆదరణ పెరుగుతోంది. కచ్చితంగా ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. వారికి మరింత చేరువ కావడం ఎలా అన్నదానిని నాతో పాటు, పార్టీ నాయకులు కూడా ఆలోచించి ముందుకు వెళ్లాం. రాకెట్ ప్రయోగించే ముందు కూడా దానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, కక్ష ఉంటాయి. జనసేన పార్టీ కూడా అది నమ్ముతుంది” అని అన్నారు.
యాత్ర కచ్చితంగా ఉంటుంది:
“అక్టోబర్ నెలలో మొదలు కావల్సిన యాత్ర కాస్త ఆలస్యం అయినప్పటికీ కచ్చితంగా యాత్ర ఉంటుంది. అక్టోబర్ నెలలో ప్రతి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉంటాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అది మొదలుపెడతాం. వచ్చే ఎన్నికల్లో తపన, తృష్ణ ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. రాజకీయాలు అంటే ఒక తపనతో ప్రజల కోసం ఏదైనా చేయాలి అనే గట్టి ఆలోచన ఉన్న నాయకులను పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబెడతాం. ప్రతి నియోజకవర్గంలోనూ బలాలు పెంచుకొని గెలుపే లక్ష్యంగా ఈ సారి పార్టీ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తాం. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే మొదటి లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు జనసేన పార్టీ బలమైన ప్రయాణం ఇప్పటికే మొదలైంది. ప్రజల కోసం బలమైన మార్పును కోరుకునే జనసేన వైపు ప్రజలు కచ్చితంగా ఒకసారి ఆలోచించి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY