ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే నాడు- నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతులు కల్పించే అంశంపై అధికారులతో చర్చించారు.
పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్న తల్లిదండ్రుల పేర్లను పాఠశాలలోని నోటీసు బోర్డుల మీద డిస్ప్లే చేయాలని, తద్వారా పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చని సూచించారు. నాడు-నేడులో భాగంగా రెండో విడత, మూడో విడత కింద చేపట్టాల్సిన పనులు, టెండర్ల ప్రక్రియ వివరాలపై అధికారులను సీఎం వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]