ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని, రాష్ట్రంలో ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలన్నారు. పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశముందని, పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్య 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇతర ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలన్నారు. అన్ని చోట్లా తప్పకుండా మాస్కులు వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడినవారికి, గర్భిణీలు మరియు టీచర్లకు వ్యాక్సినేషన్ లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కరోనా పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని, దీంతో పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయన్నారు. ఇంటింటికీ సర్వే కొనసాగించి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని చెప్పారు. 104 కాల్ సెంటర్ సిబ్బంది సమర్థవంతగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణలు, సమీక్షలు చేయాలని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నిర్వహణ, విలేజీ క్లినిక్స్లో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు, టెస్టులు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు, కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో పనుల పురోగతిపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ