ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 2, సోమవారం నాడు నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజక వర్గ ప్రగతి సమీక్షా సమావేశం సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ ను గెలిపించి, అద్భుతమైన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా రావడంతో నియోజకవర్గ పర్యటనకు రావడం ఆలస్యమైందని చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హాలియాకు రూ.15 కోట్లు, అలాగే నందికొండ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు, వీటితో పాటుగా ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టల నిర్మాణానికి రూ.120 కోట్లను కలిపి మొత్తం రూ.150 కోట్లు మంజూరు చేస్తునట్టు తెలిపారు. అలాగే హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, రెడ్డి కల్యాణ మండపం, షాదీఖానా నిర్మాణాలను చేపడతామని సీఎం తెలిపారు.
దేవరకొండలో ఐదు లిఫ్ట్లు, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్లు, నకిరేకల్లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్, కోదాడ వద్ద ఒక లిఫ్ట్, గుర్రం పోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్, ఇలా జిల్లాకు మొత్తం మొత్తం 15 లిఫ్ట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ లిఫ్ట్లన్నింటినీ రాబోయే సంవత్సరంన్నరలో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు, ఆంధ్రావాళ్ళు చేస్తున్న దాదాగిరి కావొచ్చు, కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను పెద్దదేవులపల్లి చెరువు వరకు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే కొనసాగుతుందని, అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆరునూరైనా దళితబంధును పథకాన్ని అమలు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ