రాష్ట్రంలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా బియ్యం కార్డు ఉన్న లేదా దారిద్యరేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ బీమా పథకం కోసం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అన్నారు. బీమాలో కేంద్రప్రభుత్వం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం భరిస్తుందని, ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో బీమా జాబితా ఉంచనున్నట్టు సీఎం పేర్కొన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వారు వయసు గలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు , సహజ మరణమైతే రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.1.50 లక్షలు, ఇక 51 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే గ్రామ సచివాలయం నుంచే రూ.10 వేలు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu