టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ముందుగా గత నెలలో నాయిని నర్సింహారెడ్డికి కరోనా పాజిటివ్ గా రావడంతో ఓ ఆసుపత్రిలో 15 రోజులకు పైగా చికిత్స పొందారు. అనంతరం ఆయనకు కరోనా నెగటివ్ గా తేలినప్పటికీ, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న సమయంలో సీఎం కేసీఆర్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, నాయకులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో నాయిని కీలక పాత్ర పోషించారు. కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, వారికీ అండగా నిలబడి గొప్ప కార్మిక నేతగా ఎదిగారు. పలు ప్రధాన కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా కూడా సేవలు అందించారు. 1978,1985, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి దశలో కూడా సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. 2005 నుంచి 2008 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పని చేసిన ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తోలి హోమ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నాయిని మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఉద్యమనేతగా తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకులు, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ మొదటి హోం మంత్రిగా మనందరి మనస్సులో నాయిని నరసింహ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారు. వారి మృతి అందర్నీ తీవ్రంగా కలిచివేసింది – మంత్రి కేటిఆర్
తెలంగాణ మాజీమంత్రి నాయిని నర్శింహారెడ్డి గారి మరణం అత్యంత బాధాకరం. ప్రత్యేక రాష్ట్రంకోసం తొలి మలి దశ ఉధ్యమాల్లో వారు చేసిన పోరాటం గొప్పది. కార్మికులు, పేదల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం నర్సన్నది. వారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. నర్సన్న కుటుంభ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నా – మంత్రి హరీష్ రావు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu