ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా అధికారికంగా నిర్వహిస్తున్న, ఒంటిమిట్ట లోని ఏకశిలానగరంగా ఖ్యాతిగాంచిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ‘సీతారామ కల్యాణం’ వేడుకలు ఈరోజు జరుగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ముత్యాల తలంబ్రాలు’ మరియు ‘పట్టు వస్త్రాలు’ సమర్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్హౌస్కు చేరుకోనున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తరువాత గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి ఆలయానికి చేరుకొని కోదండరామ స్వామిని దర్శించుకుంటారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కల్యాణ వేదిక వద్దకు చేరుకుని సీతారాముల కల్యాణాన్ని తిలకించనున్నారు.
గడచిన రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా సీతారాముల కల్యాణాన్ని బహిరంగంగా నిర్వహించలేదు. అలాగే భక్తులెవరినీ ఆంక్షల కారణంగా అనుమతించలేదు. దీంతో ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరగనున్న ఈ అద్భుత ఘట్టానికి ఒంటిమిట్ట లోని ‘మిథిలా మండపం’ ముస్తాబైంది. ఈ సందర్భంగా గురువారం టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ఒంటిమిట్ట లోని స్వామి వారి కల్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక్కడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం భోజన వసతితో పాటు వేసవి కారణంగా మజ్జిగను కూడా పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ