ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 14, గురువారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ముందుగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించాలని నిర్ణయించుకుంది. తొలి దశలో 15 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మొత్తం మూడు దశల్లో పూర్తిచేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు తో పాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదుకోకపోతే భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బిడ్డలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవాలా, సామాన్యులకు గొప్ప భవిష్యత్ అక్కర్లేదా అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తామని, తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉంటుందని సీఎం జగన్ తెలియజేశారు.
[subscribe]