ఎన్నికల సమయంలో ఒక పార్టీ.. ఇంకో పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలాగున్నా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అధినేతలకు మాత్రం తలనొప్పులు తప్పవు. మనం గెలిచే స్థానాన్ని ఆ పార్టీకి ఎందుకు ఇచ్చారని కొందరు.. నాకు టికెట్ ఆశ చూపి మోసం చేశారని ఒకరు.. ఇలా ఇరు పార్టీల్లోనూ ఆందోళనలు మొదలవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. స్థానాలు, టికెట్ల కేటాయింపుల అంశాల్లో కొన్నిచోట్ల కేడర్ నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కాకినాడ జిల్లా పిఠాపురంలో తాజాగా జరిగిన ఆందోళనలే నిదర్శనం. ఆ సీటును జనసేనకు కేటాయించడాన్ని తప్పుబడుతూ టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఏకంగా పసుపుజెండాలను తగులబెట్టారు.
ఆస్థాయిలో కాకపోయినా.. అక్కడక్కడా ఆందోళనలు, ఆవేదనలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో పొత్తు ఆవశ్యకత గురించి ఆయా పార్టీల అధినేతలు.. నియోజకవర్గాల నేతలకు, కార్యకర్తలకు నచ్చచెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ.. కొన్నిచోట్ల ఆందోళనలు ఆగడం లేదు. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పలుచోట్ల నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ విధ్వంస పాలనతో కుప్పకూలిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికే మూడు పార్టీలం పొత్తు పెట్టుకున్నాయని ఓ పక్క చంద్రబాబునాయుడు, ఇంకో పక్క పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇది రాష్ట్రం కోసం కుదిరిన పొత్తు తప్ప వ్యక్తుల కోసమో, పదవుల కోసమో కుదిరింది కాదని నేతలకు నచ్చచెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని.. మళ్లీ అక్కడ ఆ పార్టీయే వస్తుందని అంటున్నారని, వైసీపీ దెబ్బకు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్లీ ముందుకు రావాలంటే కేంద్రం సహకారం అవసరమని తాజాగా మరోసారి చంద్రబాబు.. నేతలకు వివరించే ప్రయత్నం చేశారు.
‘ప్రతిపక్షం విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తాను గెలుస్తానని జగన్ ఆశ. దాని కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. తక్కువ సీట్లకు ఒప్పుకొంటున్నారని జనసేన, బీజేపీ పార్టీలను రెచ్చగొట్టాలని చూశారు. పరోక్షంగా వాటిపై ఒత్తిడి తేవాలని చూశారు. వైసీపీ విముక్త రాష్ట్రం సాధిస్తానని ప్రకటించిన పవన్ ఆ మాట నిలుపుకోవడం కోసం పొత్తులో కొంత తగ్గారు. మేం ఎవరం అహాలకు పోలేదు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశానని నేను బింకంతో కూర్చోలేదు. ప్రజల కోసం అందరం తగ్గాం. టీడీపీకి పొత్తులు కొత్త కాదు. వాజపేయి హయాంలోనే ఎన్డీయేలో ఉన్నాం’ అని చెప్పారు.
ఓవైపు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే.. కొందరు నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. పొత్తుపైన, జనసేనకు కేటాయించిన స్థానాలపైన, టికెట్ల కేటాయింపుపైన ఇక ప్రశ్నలు వేయడం, ఆందోళనలు చేయడం ఆపి.. పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పేర్కొంటున్నారు. రాష్ట్ర హితం కోసం కలిశామని.. ఈ మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా కాదన్నారు. అందరికీ సీట్లు రావని.. కేంద్రంలో, ఇక్కడా కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయని.. వాటిలో కొందరికి అవకాశాలు రావొచ్చని సూచిస్తున్నారు. ఈక్రమంలో చంద్రబాబునాయుడు కొందరు నేతలను పిలుపించుకుని కుదిరితే బుజ్జగింపులు.. లేదంటే వార్నింగ్ లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE