తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసారు. మొదటగా నవంబర్ 8, శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి, ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించగా, నవంబర్ 11 సోమవారం నాడు రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. ఇక ఈ అంశంపై తదుపరి విచారణ నేడు హైకోర్టులో జరగనుంది. 5100 రూట్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పిటిషనర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ను దాఖలు చేసిన కౌంటర్ పై విచారణ జరగనుంది. అనంతరం రూట్ల ప్రైవేటీకరణపై విధించిన స్టే పై హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
[subscribe]