ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి పింఛన్లు తొలగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారికి నిధులు విడుదల చేశారు. ‘జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ కాపునేస్తం’ తదితర పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.79 లక్షల మందికి పైగా లబ్దిదారులకు రూ.590.91 కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఎక్కడా అవినీతికి, లంచాలకు తావు లేకుండా చేస్తున్నామని, కుల, మతాలకు అతీతంగా, అన్ని పార్టీల వారికీ ఈ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.
సాధారణంగా ప్రభుత్వం అందించే పింఛన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగుతుందని, ఈ పద్దతిలో నోటీసులు ఇచ్చి రీ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారని సీఎం జగన్ తెలియజేశారు. అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి భయపడుతున్నాయని, అందుకే పని కట్టుకుని దీనిపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. ఆడిట్ జరుగుతుంటే పింఛన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు మంచి చేసినా అందులో కూడా చెడు చూస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందాలన్నదే తమ లక్ష్యమని, దీనిలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 62 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పింఛన్ రూ.2,750కి పెంచామని, దీనికోసం ప్రతినెలా రూ.1770 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్నవారు నష్టపోకూడదన్నదే తమ విధానమని తెలిపిన సీఎం జగన్.. అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతుంటే వాటిని తీసేయడంలో తప్పు లేదని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY