తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోపచర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు నిర్వహిస్తుందని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను, కలెక్టర్ల బాధ్యతలను వివరించారు.
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
=> తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాము. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం.
=> మిషన్ భగీరథ పథకం వల్ల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నది.
=> కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు లాంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి.
=> కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచింది. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉంది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్ గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. దీనివల్ల కొంత పనివత్తిడి తగ్గుతుంది.
=> గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలి. వాటిని సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. మురికి గుంటలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుపడిన బావులు పూడ్చివేయాలి. పాత బోరుబావులను పూడ్చాలి. ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలి.
=> గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపిఓలను, ఎంపిడివోలను, డిఎల్పివో, డిపిఓ, జడ్పీ సిఇవో లాంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాము. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాద్యతను కలెక్టర్లు తీసుకోవాలి.
=> కలెక్టర్లకు సహాయకారిగా ఉండేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించాం. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి.
=> రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలను ఆహ్వానించాలి. గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలి. ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలి. సర్పంచులు, కార్యదర్శులు ఏమేం చేయాలో వివరించాలి. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. ఈ సమ్మేళనంలో విధులు, బాధ్యతలు చెప్పాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.
=> పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. కేవలం స్పెషల్ డ్రైవ్ గా కాదు, ఇది నిరంతరం సాగాలి. దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయించాలి. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను ఖచ్చితంగా బతికించాలి. గ్రామంలో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలి.
=> గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతీ కలెక్టర్ వద్ద ఒక్కో కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతాము. గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప స్మగ్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పది ఎకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.
=> హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం చాలా తక్కువగా ఉంది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు.
=> ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి.
=> పంచాయతీ రాజ్ శాఖలో దాదాపు ఖాళీలన్నీ భర్తీ చేశాము. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం.
=> పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తుంది.
=> పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.
=> రాష్ట్రంలో గతంలో కేవలం 6 మున్సిపల్ కార్పొరేషన్లుంటే, వాటిని 13కు పెంచుకున్నాం. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128 చేసుకున్నాం. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి.
=> తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలి. తమ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
కలెక్టర్లకు కీలక సూచనలు:
- సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. మంచి ఆలోచనా విధానం ఉండాలి. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి, అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయాలి.
- కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా గ్రామాలు, పట్టణాల పాలనలో కలెక్టర్ల బాధ్యతను ప్రభుత్వం పెంచింది.
- కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్ లెస్ సెట్లు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది.
- భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలి. ఖచ్చితంగా సంస్కరణలు రావాలి. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదు. మిగతా వాటిని పరిష్కరించాలి.
- ప్రభుత్వం కొత్తగా నియమించిన అడిషనల్ కలెక్టర్లు తమకు అప్పగించిన శాఖ/బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. స్థానిక సంస్థల వ్యవహారాలు చూసే అడిషనల్ కలెక్టర్ల కంప్యూటర్లో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సంపూర్ణ వివరాలుండాలి.
- గ్రామాల్లో, పట్టణాల్లో చార్జుడ్ అమౌంటు (విధిగా చేయాల్సిన ఖర్చు)ను అడిషనల్ కలెక్టర్లు నిర్ధారించాలి. కరెంటు చార్జీల చెల్లింపు, జీతభత్యాలు, అప్పుల కిస్తీలు తదితర వ్యయం చార్జుడ్ అమౌంట్ కిందికి వస్తాయి.
- డిపిఓ, డిఎల్పివో, ఎంపివో, గ్రామ కార్యదర్శులతో అడిషనల్ కలెక్టర్లు నిత్యం సమావేశమవుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలి.
- అడిషనల్ కలెక్టర్లందరికీ రెండు రోజుల పాటు ‘గ్రామీణాభివృద్ధి, పట్టణాభివద్ధి’పై శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులకు కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి.
- వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు టాయిలెట్లు లేక చెప్పరాని అవస్థలు పడుతున్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి.
- అన్ని పట్టణాల్లో వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం మూడు చొప్పున, పట్టణాల్లో కనీసం ఒకటి చొప్పున ఈ మార్కెట్లను నిర్మించాలి.
- కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యుసి) పంపడం ప్రాధాన్యతాంశంగా కలెక్టర్లు గుర్తించాలి. జిల్లాల వారీగా ఫారెస్టు బ్లాకులను గుర్తించి, అడవుల పునరుద్ధరణకు, అడవుల రక్షణకు చర్యలు తీసుకోవాలి. అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలి. అవకాశం ఉన్న ప్రతీ చోటా మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలి. చెట్లు పెంచడం, అడవులను పునరుద్ధరించడం లాంటి గ్రీన్ ప్లాన్ అమలుకు నిధుల కొరత రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వినియోగించుకోవాలి.
- అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను పరిష్కరించాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. ఇందుకోసం ప్రభుత్వం కార్యక్రమం లేని పక్షంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఆయా జిల్లాల్లో పర్యటించి, పోడు భూముల సమస్యకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
- పట్టణ ప్రగతి కార్యక్రమానికి పట్టణాల్లోని వార్డును యూనిట్ గా చూడాలి. ఆ వార్డులోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నియమించే ప్రజా కమిటీలోని సభ్యులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డుల వారీగా సమస్యలు గుర్తించాలి. మొత్తం పట్టణానికి సంబంధించిన సమస్యలు గుర్తించాలి.
- ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్ పాత్ లపై వ్యాపారం చేసుకునేవారిని బలవంతంగా తరలించవద్దు.
[subscribe]