కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8, బుధవారం నాడు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించింది. “ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్నెస్” పేరుతో ఈ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో కేటాయించే 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ ప్రాజెక్టును జనవరి 2020 నుండి మార్చ్ 2024 వరకు మూడు దశల్లో అమలు చేయనున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ వందన గుర్నాని విడుదల చేసిన సర్కులర్ లో తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలుకొనుగోలు చేయడం, ఔషదాల ఉత్పత్తి, పరీక్షా కేంద్రాలు, బయో సెక్యూరిటీని తయారు చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్రాలకు సూచించింది. మూడు దశల్లో భాగంగా 2020 జనవరి నుంచి 2020 జూన్ వరకు తొలిదశగా నిర్ణయించారు. అలాగే 2020 జూలై నుంచి 2021 మార్చ్ వరకు రెండో దశగా, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చ్ వరకు మూడో దశగా నిర్ణయించారు. జాతీయ ఆరోగ్య ప్యాకేజీలో భాగంగా తొలిదశ నిధులను విడుదల చేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.