ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్, జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన రివర్స్ టెండరింగ్ లో పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు ప్రభుత్వం బెంచ్ మార్క్ విలువను రూ.4,987.55 కోట్లుగా నిర్ణయించగా, 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ కోట్ చేసింది. రూ.4,358.11 కోట్లు కోట్ చేసి ఎల్1 నిలిచి ప్రాజెక్టు పనులను దక్కించుకుంది.
సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిడ్ తెరిచింది. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.628.43 కోట్లు ఆదా అయ్యాయి. పోలవరం 65వ ప్యాకేజికి సంబంధించిన పనుల రివర్స్ టెండరింగ్ లో కూడ ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా అయినా సంగతి తెలిసిందే. అయితే ఏపీ జలవనరుల శాఖ ఇచ్చిన టెండర్ నోటీసుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ మాత్రమే గడువు లోపల బిడ్ ను దాఖలు చేసింది. ఫ్రీ బిడ్ సమావేశాలకు 8 సంస్థలు హాజరై చర్చించిన కూడ, గడువులోగా మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసి కాంట్రాక్టు దక్కించుకుంది.
[subscribe]