తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో, హుజూర్నగర్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శానంపూడి సైదిరెడ్డి కి బి-ఫారం అందజేసారు. శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధిస్తారని, అన్ని సర్వేలలో ఆయనకు అనుకూలంగా ఉందని కేసీఆర్ చెప్పారు. త్వరలో నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. సైదిరెడ్డి కి బి-ఫారం అందించిన అనంతరం మాట్లాడుతూ గెలుపు ఖాయమని, మెజారిటీపైనే దృష్టి సారించాలని, మెజారిటీ 50 వేలు పైగా దాటాలి అని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, బీజేపీ పార్టీకి కనీసం డిపాజిట్ కూడ దక్కొద్దని అన్నారు. హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని కోరారు. తనకు టికెట్ కేటాయించినందుకు సైదిరెడ్డి, కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మరో వైపు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్గొండలో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హుజూర్నగర్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ డబ్బు పంచుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, అయితే కోదాడలో డబ్బుతో దొరికిన ఇన్నోవా ఎవరిదో ఓసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు. హుజూర్నగర్ లో టిఆర్ఎస్ విజయం తధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు.
[subscribe]