ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన చైనా ఓపెన్ లో ఆడిన సింధు అనూహ్యంగా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక సెప్టెంబర్ 24, మంగళవారం నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో టైటిల్ యే లక్ష్యంగా బరిలోకి దిగి తిరిగి తన సత్తా చాటాలని చూస్తుంది. 2017 లో జరిగిన కొరియా ఓపెన్ టోర్నీలో పీవీ సింధు టైటిల్ సాధించింది. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్ లతో పాటు, డబుల్స్ విభాగానికి చెందిన మ్యాచులు జరగనున్నాయి. ఇక బుధవారం మెయిన్ డ్రా సింగిల్స్ మ్యాచులు జరుగుతాయి.
ఈ కొరియా ఓపెన్ టోర్నీ తోలి రౌండ్లో సింధు చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్తో తలపడనుంది. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు బీవెన్ జాంగ్పై అలవోకగా గెలిచింది,ఇక రెండవ రౌండ్లో చైనా ఓపెన్ లో తనను ఓడించిన థాయిలాండ్ షట్లర్ చోచువాంగ్ తో తలపడే అవకాశం ఉంది. మరోవైపు ఎనిమిదో సీడ్ గా బరిలోకి దిగుతున్న సైనా నెహ్వాల్ తోలి రౌండ్లో కొరియా క్రీడాకారిణి కిమ్ గా యున్ తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ లో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతకం సాధించిన సాయిప్రణీత్ తొలిరౌండ్లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో తలపడబోతున్నాడు. కశ్యప్ తోలి రౌండ్లో క్వాలిఫయర్ తో ఆడనున్నాడు. కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.