ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మరోసారి మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుందని, సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువకు చేరే వరకు ఈ రెండు జిల్లాల్లో ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. ఇక మిగతా 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని, రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఈ సడలింపులు జూలై 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
మరోవైపు సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లుకు, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్లు, జిమ్స్ తెరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని చోట్ల మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతికదూరం పాటించడం సహా అన్ని కోవిడ్ ప్రొటోకాల్స్ ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగా సోమవారం ఉదయం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులు, వ్యాక్సినేషన్ పై మంత్రులు, కోవిడ్ టాస్క్ఫోర్స్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ