ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21వ తేదీన ‘వైఎస్సార్ చేనేత నేస్తం’ పథకం ప్రారంభించి, అర్హులైన ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.24 వేలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి, అక్కడనుంచి ఆన్లైన్ సంస్థల ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. తొలిదశలో భాగంగా నవంబర్ 1వ తేదీ అమెజాన్ ద్వారా 25 రకాల వస్త్ర ఉత్పత్తుల విక్రయాలు మొదలుపెట్టనున్నారు. మరో సంస్థ ఫ్లిప్కార్టు ద్వారా కూడ నవంబర్ చివరి వారంలో వస్త్రాల అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి గాంచిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, వెంకటగిరి, పెడన, మాధవరం తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించనున్నారు. తొలి విడతలో మధ్యతరగతి ప్రజలుకు సైతం అందుబాటులో ఉండేలా రూ.500 నుంచి రూ.20 వేల వరకు ధర ఉన్న వస్త్రాలను ఆన్లైన్ లో పెట్టనున్నారు, ఈ చేనేత వస్త్రాల కొనుగోలులో వినియోగదారులు ఎవరూ మోసపోకుండా వాటిపై ప్రభుత్వ గుర్తింపు లోగోను ముద్రించబోతున్నారు. నవంబర్ 1 నుంచి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతారు, అనంతరం అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.
[subscribe]