టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. రాజీనామాకు కారణాలు వివరిస్తూ వంశీ రెండు సార్లు లేఖ రాయడం, చంద్రబాబు ప్రతిస్పందించడం ఇప్పటికే జరిగింది. తదనాంతర పరిణామాలు చర్చించడానికి ఈ రోజు కృష్ణాజిల్లాలోని ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, పలువురు సీనియర్ నాయకులు హాజరైయ్యారు. టీడీపీ అధిష్టానం వంశీ రాజీనామాపై ఆచితూచి స్పందిస్తుంది, వంశీతో చర్చించేందుకు ఎంపీ కేశినేని నానిని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పంపింది. ఈ పరిస్థితుల్లో వంశీ రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతుంది.
మరో వైపు గన్నవరం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీలో కొనసాగాలా, ఎమ్మెల్యే వంశీతో వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ నాయకుడు బొండా ఉమా, వంశీ రాజీనామాపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే సంబంధిత సంప్రదాయ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలని, వేరే విధంగా ఇస్తే ఎందుకు పనిచేయవని వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇకపై ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
[subscribe]