ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంట్ వేదికగా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్న కేంద్రం, హైకోర్టును కర్నూల్కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈరోజు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఇది సమ్మతమేనని పేర్కొన్నారు.
అయితే అనంతరం ఏపీ సీఎం జగన్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయని కేంద్ర మంత్రి వివరించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిప్రకారం రాజధాని అమరావతి నగరం సహా పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించిందని తెలియజేశారు. ఇక హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE