ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కమిటీ హాల్ నంబర్-1లో గురువారం ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగగా, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవగా, ముందుగా పోల్ అయిన 175 ఓట్లు వ్యాలిడ్ అని అధికారులు పేర్కొన్నారు. కాగా మొత్తం 7 స్థానాలను దక్కించుకోవాలనుకున్న అధికార వైఎస్సార్సీపీ పార్టీకి షాక్ తగిలింది. ఓ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున 23 ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాళి గిరి, వాసుపల్లి గణేశ్కుమార్ టీడీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో తనకున్న బలాన్ని బట్టి టీడీపీ ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని మాత్రమే పోటీకి నిలబెట్టింది. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు దక్కించుకుని గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వలనే టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం దక్కించుకున్నట్టు స్పష్టం అవుతుంది.
ఇక అధికార వైఎస్సార్సీపీకి 151 ఎమ్మెల్యేలు ఉండగా, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైఎస్సార్సీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు, ఒక టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ పెనుమత్స సూర్యనారాయణ, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, చంద్రగిరి ఏసు రత్నం, మర్రి రాజశేఖర్, టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. ఇక ఏడో స్థానం కోసం వైఎస్సార్సీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ మధ్య పోటీ నెలకొనగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో జయమంగళ వెంకటరమణ విజయం సాధించగా, కోలా గురువులు పరాజయం పొందారు.
ముందుగా మొత్తం ఏడు స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా, ప్రతిపక్ష టీడీపీ ఒక స్థానానికి తన అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ రెండుసార్లు మాక్ పోలింగ్ నిర్వహించి తన ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసింది. ముందునుంచే వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరుగనుందన్న అనుమానాల నేపథ్యంలో ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించడం ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, 19 మంది టీడీపీ సభ్యులు కాకుండా ఆమెకు అనుకూలంగా ఓటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE