ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ చేసిన సూచనపై ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బొత్స సత్యనారాయణ గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం పడవ తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలని, వారిని పరీక్ష కేంద్రాల వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అలాగే పరీక్ష పూర్తయ్యాక విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.
ముందు ముందు ఎండలు ఇంకా తీవ్రమవనున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో మంత్రి బొత్స చర్చించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు, వైద్య సదుపాయం వంటి ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. మంత్రి సమీక్ష అనంతరం, ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ ఏపీఎస్ ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై స్పందించిన ఆర్టీసీ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సదుపాయం పదవ తరగతి పరీక్షల సమయంలోనే.. అనగా ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 3,780 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ