తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి చైర్మన్, ప్రసిద్ధ రచయిత మరియు పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 84 సంవత్సరాల ప్రభాకర్ రావు 2016 ఏప్రిల్ నుంచి కొన్ని సంవత్సరాలు కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన అనేక తెలుగు వార్తాపత్రికలలో పనిచేశారు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, గోల్కొండ, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ వంటి దిన పత్రికలలో కాలమిస్టుగా పనిచేశారు. కాగా ప్రభాకర్రావు మృతి వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. ప్రభాకర్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ అధికార భాషా సంఘం తొలి చైర్మన్గా దేవులపల్లి ప్రభాకర్ రావును సీఎం కేసీఆర్ నియమించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన రచనల ద్వారా విశేష కృషి చేసిన ప్రభాకర్ రావును 2016లో భాషా కమిషన్కు అధిపతిగా సీఎం కేసీఆర్ నియమించారు. 1938లో వరంగల్ పట్టణంలో జన్మించిన దేవులపల్లి ప్రభాకర్ రావు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉతీర్ణులయ్యారు. దేవులపల్లి రాసిన ‘మహాకవి గురజాడ జీవితం-సాహిత్యం’ గ్రంథానికి ప్రతిష్టాత్మకమైన యునెస్కో అవార్డు లభించింది. జాతీయ సమైక్యతపై రాసిన ‘నేను ఎవరు’ అనే రచనకు భారత ప్రభుత్వ అవార్డు లభించింది. అలాగే మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ‘అల్లూరి సీతారామరాజు’పై రాసిన ఒక రేడియో నాటికకు జాతీయ అవార్డు వరించింది. కాగా దేవులపల్లి మృతిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు తమ సంతాపం తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ