జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 128 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. కౌలు రైతుల కుటుంబ కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా శిరివెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాయలసీమను రతనాలసీమ అనేవారు. సిరులు కురిపించిన నేల అని పిలిచేవారు. ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చూస్తుంటే బాధేస్తుందని, గుండె తరుక్కుపోతోందన్నారు. 18 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చే సిద్దేశ్వరం-అలుగు ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారని, 70 ఏళ్లుగా ఇక్కడి రైతాంగం కల అదని చెప్పారు. నాయకుల తీరుతో విసిగి వేసారి 2016లో రైతులే ప్రాజెక్ట్ ప్రారంభించినా, దానిని పూర్తి చేయడంలో రాయలసీమవాసులకు అండగా నిలబడటంలో మాత్రం ఏ ప్రభుత్వాలు శ్రద్ధ చూపించలేకపోయాయన్నారు. మీరు ఐదు సంవత్సరాలపాటు మాకు అవకాశం ఇవ్వండి. జనసేనకు అండగా నిలబడండి. కచ్చితంగా రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత తనదని, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఎన్నికలు ముందస్తుగా వచ్చిన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం. :
“వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ ప్రజల అండతో సిద్ధంగా ఉంది. ఎన్నికలు ముందస్తుగా వచ్చిన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం. 151 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినా ప్రజల కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. దీనిని మాట్లాడేందుకు నాయకులకు భయం. ఎలాంటి భయం లేకుండా నేను మాట్లాడుతుంటే, వీళ్లకు ఎందుకు భయాలు?, రాయలసీమ అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. పొత్తుల విషయం, ఇతర విషయాలు ఏ మాత్రం రహస్యంగా చేసే పద్ధతి ఉండదు. అంతా పారదర్శకంగా ప్రజా క్షేత్రంలోనే ముందుకు వెళ్తాం. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఇది. మద్యం ద్వారా వస్తున్న గణనీయమైన డబ్బులను వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటు పంచుకోవడానికి వైసీపీ నేతలు దాచుకుంటున్నారు. నాకు ఏ పార్టీ మీద వ్యక్తిగత ఆపేక్ష లేదు. ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చి ప్రజలు బాగుండాలన్నదే నా ఆకాంక్ష. దీనిపై బీజేపీ జాతీయ నాయకులకు తెలియజేస్తా. వారి సమ్మతి తీసుకొనే ముందుకు వెళ్తాం. అధికారం ఇస్తే కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడుస్తా, నన్ను ఆశీర్వదించండి. ప్రజల తరఫున పోరాడే బలం ఇవ్వండి. ఏటా లక్ష మంది యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి, వారు పదిమందికి ఉపాధి కల్పించేలా చూసే అద్భుతమైన ఆలోచనలు జనసేన పార్టీ వద్ద ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరెన్నో ప్రణాళికలతో ముందుకు వస్తాం. ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడగడతామని, ప్రజా పోరాటాలతో ముందుకు వెళతాం” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ