నెల్లూరుకు చెందిన అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటంరెడ్డి మురుగు కాలువ లోకి దిగడం అధికార వర్గాలలో కలకలం సృష్టించింది. ఈ ఘటన పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో అవాక్కయిన అధికారులు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేకి రాతపూర్వక హామీ ఇవ్వవలసి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటను సందర్శించారు.
ఈ క్రమంలో స్థానికులు తాము ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన కాలనీలో వంతెన, డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనివలన ఇక్కడ నివసిస్తున్న వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమస్యను ఎవరికీ చెప్పాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పరిధిలో ఉందని ఒకరు, అది మా పరిధి లోకి రాదని మున్సిపల్ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారని వాపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసనగా అక్కడి డ్రైనేజీలోకి దిగి కలకలం సృష్టించారు. అయితే ఎమ్మెల్యే చర్యతో స్థానికులతో పాటు అధికారులు కూడా విస్తుపోయారు.
అయితే తేరుకున్న అధికారులు ఎమ్మెల్యేని బయటకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసినా, ఆయన సుమారు ఒక గంట సేపు ఆ మురుగు నీళ్లలోనే ఉన్నారు. వర్షాకాలం ప్రారంభమైందని, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని, అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతూ.. రాతపూర్వక హామీ ఇస్తేనే కదులుతానని తేల్చి చెప్పడంతో చేసేది లేక మున్సిపల్ అధికారులు అలాగే హామీ రాసి ఇచ్చారు. దీంతో శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు. కాగా ఎమ్మెల్యే చర్య జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉందా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ