కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేఫథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం తిరుమలలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని, ఇది కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే మాత్రమే పరిమితం అని స్పష్టం చేశారు. అలాగే గరుడ వాహనం రోజు తిరుమలకు బైకులకు అనుమతి లేదని, వాహనదారులు దీనిని గమనించాలని ఆయన సూచించారు. కాగా సెప్టెంబర్ 27న ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగనుందని, అదేరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఇక అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, 5న చక్రస్నానం కార్యక్రమాలు జరుగనుండగా, ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తామని ధర్మారెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ