ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ – 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ను గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, ప్రముఖ నటుడు రజినీకాంత్ తదితరులు హాజరయ్యారు. కాగా స్టేడియం లోపల చెస్ ఆటను పోలి ఉండేలా నలుపు, తెలుపు రంగులతో అలంకరించారు. ఇక కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు తమిళ సంస్కృతి ఉట్టి పడేలా రూపొందించారు. వేదికపై సీఎం స్టాలిన్ ప్రత్యేక జ్ఞాపికతో ప్రధాని మోదీని సన్మానించారు.
ఇక 44వ చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ జూలై 28న ప్రారంభమై ఆగస్టు 9 వరకు జరగనుంది. 1927 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు మొదటిసారిగా భారతదేశంలో మరియు 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించబడుతుండటం విశేషం. మొత్తం 187 దేశాలు పాల్గొంటుండడంతో చెస్ ఒలింపియాడ్లో ఇదే అతిపెద్ద పార్టిసిపేషన్ కానుంది. భారత్ తరఫునుంచి కూడా అతిపెద్ద బృందం ఈ పోటీల్లో పాల్గొననుంది. ఓపెన్, మహిళల విభాగంలో జరుగనున్న ఈ పోటీలలో రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్ తరపున మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తెలుగు క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ, అర్జున్ వివిధ జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు.
ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్ నార్వే జట్టు తరపున ఆడుతుండగా, భారత ప్రముఖ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఇండియన్ టీమ్స్ కు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ చెస్ ఒలింపియాడ్ స్విస్ లీగ్ ఫార్మాట్లో జరుగనుంది. మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరుగుతాయి. తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లకు స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. దీనికి తోడు ఓపెన్ సెక్షన్లో విజేతకు హామిల్టన్-రస్సెల్ కప్, మహిళల విభాగంలో వెరా మెన్చిక్ కప్, సంయుక్త కేటగిరీలో అగ్రస్థానంలో నిలచిన వారికి నోనా గాప్రిదశ్విలీ ట్రోఫీ వంటివి అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY