గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను గురువారం నాడు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.50 లక్షలమంది హాజరవ్వగా వారిలో, 1,98,164 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ ఉద్యోగాలకు ఇంటర్వూలు లేకపోవడం వలన జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాను విడుదలచేసి, వారికే కాల్ లెటర్లు పంపుతామని పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. మెరిట్ జాబితాను శుక్రవారం కల్లా జిల్లాలకు చేరవేస్తామని, జిల్లాలో భర్తీచేసే ఉద్యోగాల సంఖ్యను బట్టి రిజర్వేషన్స్ అనుగుణంగా షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పారు. శనివారం కల్లా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ పక్రియ పూర్తీ చేసి, ఎంపికైన వారి జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
జిల్లావారీగా ఎంపికైన అభ్యర్థులకు 21, 22 తేదీల్లో కాల్ లెటర్లు పంపించనున్నారు. కాల్ లెటర్లను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 23 నుంచి 25వ తేదీవరకు వారి జిల్లాలో జరిగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించ వలసి ఉంటుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్స్ ఆధారంగా 27న నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అక్టోబర్ 1,2 తేదీల్లో వారికీ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.
[subscribe]