ఏపీ మహిళా కమిషన్ ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సమన్లు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ “నోటీస్” జారీ చేయడంతో రాజకీయ దుమారం రేగుతోంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ వాగ్వాదానికి దారితీసింది. కాగా, బాధితురాలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధ్యుల విషయంలో కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నిన్న వియజయవాడలో బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు అప్పటికే అక్కడ గుమికూడి ఉండటం, అదే సమయంలో కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడకు చేరుకోవటం నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అందరూ ఆమెను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషన్ చైర్పర్సన్పై టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆమెను ఆస్పత్రిలోకి వెళ్లనీయకుండా చాలాసేపు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాసిరెడ్డి పద్మ, చంద్రబాబు నాయుడుతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. మహిళా కమిషన్ చైర్పర్సన్ పై దాడిని అడ్డుకోలేదని ఆరోపిస్తూ.. “దౌర్జన్యం చేసి అవమానించినందుకు” అంటూ చంద్రబాబు నాయుడుకు నోటీస్ జారీ చేయడం ఏపీలో చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు కూడా సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ