రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్కుమార్ బీసీజీ నివేదిక వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై బీసీజీ రెండు ఆప్షన్లు సూచించిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా గుర్తించి వాటి అభివృద్ధిపై దృష్టి సారించాలని బీసీజీ సూచించిందని విజయ్కుమార్ తెలిపారు. బీసీజీ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే రూ.2.5లక్షల కోట్లు అప్పు ఉందని, దీనివల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఇబ్బందులు ఉన్నాయని కమిటీ పేర్కొందన్నారు. 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, అలాగే 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉందని తెలిపారు. విశాఖపట్నంలో తప్ప మిగతా చోట్ల అంతర్జాతీయ విమాన ప్రయాణికులు లేరని, అలాగే పోర్టులు కూడా అక్కడే ఎక్కువ అభివృద్ధి చెందాయని చెప్పారు. ఉత్తరాంధ్రను మెడికల్ హబ్గా అభివృద్ధి చేసే అవకాశాలన్నాయని కమిటీ నివేదికలో పేర్కొందని చెప్పారు.
అభివృద్ధి కోసం ఆరు ప్రాంతాలుగా విభజన:
- ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)
- గోదావరి డెల్టా (తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి)
- కృష్ణా డెల్టా (కృష్ణా, గుంటూరు)
- దక్షిణాంధ్ర (నెల్లూరు, ప్రకాశం)
- ఈస్ట్ రాయలసీమ (చిత్తూరు,కడప)
- వెస్ట్ రాయలసీమ (కర్నూలు, అనంతపురం)
మూడు రాజధానులు – రెండు ఆప్షన్స్:
ఆప్షన్ 1 :
- విశాఖపట్నం: సచివాలయం, గవర్నర్- సీఎం కార్యాలయాలు, 15 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ.
- అమరావతి: శాసనసభ, హైకోర్టు బెంచ్, 15 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు.
- కర్నూలు: హైకోర్టు, రాష్ట్ర కమిషనరేట్లు, అప్పిలేట్ సంస్థలు.
ఆప్షన్ 2:
- విశాఖపట్నం: సచివాలయం, గవర్నర్- సీఎం కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ.
- అమరావతి: శాసనసభ, హైకోర్టు బెంచ్.
- కర్నూలు: హైకోర్టు, రాష్ట్ర కమిషనరేట్లు, అప్పిలేట్ సంస్థలు.
[subscribe]