ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది పిటిషన్ వేశారు. అలాగే సీబీఐ కేసుల విచారణ పూర్తైన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం నాడు కోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు కొట్టివేసింది. చార్జిషీట్లపై వేర్వేరుగానే విచారణ జరపాలని కోర్టు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణను జనవరి 24కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు సంబంధించి ఈ వారానికి సీఎం వైఎస్ జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించి జరిగిన విచారణకు ప్రక్రియకు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు.
[subscribe]