యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పును జనవరి 27న వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డిని జనవరి 17, శుక్రవారం నాడు నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విచారణ నేటితో ముగిసింది.
ఈ కేసులో ముందుగా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలను హత్య చేసినట్లుగా పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. జనవరి 8వ తేదీనే ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తవగా మరో ఇద్దరు బాలికల హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే 27న తీర్పు ప్రకటిస్తామని పోక్సో కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అలాగే విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలను హత్య చేశాడని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయంటూ కోర్టుకు వివరించారు. నిందితుడి గత నేర చరిత్రను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కేసును ప్రత్యేకమైనదిగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని కోర్టును కోరారు.
[subscribe]