ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27, గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయం బయట వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో రెండు గంటలకు పైగా వాహనంలోనే కూర్చున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చారు. వైసీపీ శ్రేణుల తీరు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ విమానాశ్రయం బయట రోడ్డుపైన చంద్రబాబు బైఠాయించారు. చంద్రబాబుతో పాటుగా టీడీపీ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు ఉన్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబును తిరిగి విమానాశ్రయం వైపు పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ‘గో బ్యాక్’ పోస్టర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా చంద్రబాబు విశాఖకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా పెందుర్తి ల్యాండ్ పూలింగ్ బాధితులతో సమావేశం అవ్వాలని భావించారు. అదే విధంగా రాంపురం గ్రామంలో వివాదాస్పదమైన వీర్రాజు చెరువును కూడా సందర్శించాలని నిర్ణయించారు. మరోవైపు విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నాయకులు నారా లోకేష్, అశోక్ గజపతిరాజు, కే ఈ కృష్ణమూర్తి, కనకమేడల రవీంద్రకుమార్, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య తదితరులు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.
[subscribe]